భారత దేశంలో మానవ సంచారం ఎప్పుడు మొదలైందన్న దానిపై పురావాస్తు శాస్త్రవేత్తలు ఓ క్లారిటీకి వచ్చారు. ఉత్తర భారతంలో ఉన్న సోన్ నది సమీపంలో ఇటీవల పురావాస్తు శాఖ అధికారులు దాబా అనే ప్రాంతం నుంచి కొన్ని రాతి పనిముట్లను సేకరించారు. వాటిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఇక్కడ జరిగిన మానవ సంచారం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దాదాపు 80వేల ఏళ్ల క్రితమే.. సెంట్రల్ ఇండియాలో మానవులు సంచరించినట్లు అంచనాకు వచ్చారు. కట్టింగ్ కోసం ఆది మానవులు ఈ రాళ్ల పనిముట్లను వాడినట్లు నిర్ధారించారు. మధ్యరాతి యుగంలో నియండర్తల్స్ వాడిన పనిముట్ల తరహాలో రాతిపనిముట్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఓ అభిప్రాయానికి వచ్చారు. కానీ అప్పుడు సంచరించిన మానవులు.. నియండర్తల్స్ అవునా కాదా అన్న అంశాన్ని మాత్రం తేల్చలేకపోయారు.
లుమినిసెన్స్ అనే టెక్నిక్ ద్వారా ఆ నాటి రాతి పనిముట్లను అధ్యయనం చేశారు. ఆ స్టడీ ద్వారా వాటి వయసును అంచనా వేశారు. అయితే సుమత్రా దీవుల్లోని తోబా అగ్నిపర్వతం పేలిన సంఘటనకు సంబంధించిన కోణాన్ని కూడా పురావాస్తుశాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సుమారు 75 వేల ఏళ్ల క్రితం తోబా అగ్నిపర్వతం పేలింది. అది దట్టమైన రాళ్లును, ధూళిని వెదజల్లింది. అవన్నీ భారత ఉపఖండంలో పడ్డాయి. దాంతో ఆనాటి మానవులు కొంత అంతరించి ఉంటారని ఓ అంచనాకు వచ్చారు. ఆ అగ్నిపర్వత పేలుళ్లను తట్టుకుని మరో 50వేల ఏళ్ల పాటు కొందరు బ్రతికి ఉంటారని మరో అంచనా వేశారు. అయితే ఆఫ్రికా నుంచి వలస వచ్చిన మానవులకు, సెంట్రల్ ఇండియాకు లింకు ఉంటుందని కొందరు భావిస్తున్నారు. కానీ హోమో సేపియన్స్తో సెంట్రల్ ఇండియాకు సంబంధంలేదని మరికొంత మంది శాస్త్రవేత్తలు తెలిపారు.